Sunday, September 25, 2016

మేరి జిందగీ మే ఆతే తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ - Meri Jindagi me Aathe tho kuch aur baath hothi



నా జీవితంలోకి నువ్వే వచ్చి ఉంటే.....!

   మనసు పురివిప్పిన నాటి నుంచి మనలో ఎన్నెన్నో కలలు పురుడు పోసుకుంటాయి. ఆ తర్వాత ఆ కలలు నెరవేరిన ట్టే అనిపిస్తాయి. ఆ కలల సౌరభాలు హృదయమంతా, జీవితమంతా వ్యాపిస్తాయి కూడా. కానీ, ఒక్కోసారి అంతలోనే అంతా అయిపోయినట్లు ఆ కలల సౌధాలన్నీ ఏ పెనుగాలి తాకిడికో విరిగిపడినట్లు చెల్లాచెదురైపోతాయి. తిరిగి చక్కబడతాయిలే అన్న ఆశే లేకుండా తునాతునకలై ఆనవాళ్లే దొరకనంత దూరాల్లోకి విసిరివేయబడతాయి. అదేమిటో గానీ, రవ్వంత కాలమే మనతో ఉండి, శాశ్వతంగా దూరమైపోతాయి. అలా పోయిన వేవీ ఇంకెప్పటికీ తిరిగి రావని తెలిసి కూడా ఎందుకో పిచ్చి మనసు.... పగలూ రేయీ వాటికోసమే పలవరిస్తూ ఉంటుంది. ఆ స్వప్న లోకమే ఉంటే ఎంత బావుండేది...! ఆ స్వప్పమూర్తే త నతో ఉంటే ఎంత అద్భుతంగా ఉండేది! అనుకుంటూ జీవితమంతా మదనపడుతూ ఉండిపోతుంది. ‘ కన్యాదాన్‌’ సినిమా కోసం హస్రత జైపూరి రాసిన ఈ పాటలో ఈ అంతరధ్వనే వినిపిస్తుంది. శంకర్‌ జైకిషన్‌ స్వరపరిచిన ఈ గీతం రఫీ గొంతులో పడి వికల మనస్కుల అంతర్వేదనను నిజంగా ఆకాశానికి చేర్చింది
* * * * *
మేరి జిందగీ మే ఆతే తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ
తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ
యే నసీబ్‌ జగ్‌మగాతే తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ
తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ
( నా జీవితంలోకి నువ్వే వచ్చి ఉంటే ఆ సంగతే వేరుగా ఉండేది 
ఆ సంగతే వేరుగా ఉండేది
నా తలరాత ను మెరిపించి ఉంటే ఆ సంగతే వేరుగా ఉండేది
ఆ సంగతే వేరుగా ఉండేది)
తానే సమస్తమై జీవితంలోకి రావలసిన వ్యక్తే రాకుండా పోయాక, ఎవరి జీవితమైనా ఉండాల్సిన రీతిలో ఎలా ఉంటుంది? ఆ అసలు మూలాల్ని పట్టించుకోకుండా ‘‘ఇలా ఎందుకున్నావు? అలా ఎందుకు అయిపోయావు?’’ అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు అర్థమేముంటుంది? తానే తన జీవన సౌధానికి మూలస్థంభం అనుకుని అన్ని సన్నాహాలూ చేసుకుంటున్న సమయంలో ఆ మూలస్థంభమే మటుమాయమైపోతే ఇంకెక్కడి జీవితం..? . ఇంకెక్కడి జీవన సౌధం? ఇప్పటికి ఈ చీకట్లు ఇలానే ఉండిపోయినా ఆ ప్రేమమూర్తి రాకతో అంతా కాంతివంతమవుతుందని కదా కలలు కన్నది.! ఆ ప్రేమమూర్తి, ఆ కాంతి పుంజం ఇంకెప్పటికీ రానే రాదని తేలిపోతే ఏమిటి చెయ్యడం? గుండెను చిక్కపట్టుకుని జీవితమంతా బిక్కుబిక్కుమంటూ గడపడమే గానీ, జీవితపు రసానందంలో ఓలలాడే అవకాశం ఎక్కడ ఉంటుంది? అవును మరి! ఆమే తన జీవితంలోకి వచ్చి ఉంటే ఆ కథే వేరుగా ఉంటుంది! జీవన కావ్యమే వేరుగా ఉంటుంది!
కయీ బార్‌ మిల్‌ చుకీ హై, యే హసీఁ హసీఁ నిగాహేఁ
వహీ బేక రారియాఁ హైఁ న మిలీ ఖుషీ కి రాహేఁ
మేరే దిల్‌ సే దిల్‌ మిలాతే, తో కుఛ్‌ ఔర్‌ బాత కుఛ్‌ ఔర్‌ బాత హోతీ
తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ / మేరే జిందగీ మే ఆతే......... /
(ఎన్నో సార్లు కలిశాయి - ఈ ముగ్ధ మనోహరపు చూపులు
అయినా, ఎప్పుడూ వికల మనస్కంగానే తప్ప, ఆనందపు దారులే దొరకలేదు
నా మనసుతో మనసు కలిపి ఉంటే - ఆ సంగతే వేరుగా ఉండేది
ఆ సంగతే వేరుగా ఉండేది / నా జీవితంలోకి నువ్వే వచ్చి ఉంటే /
ఎవరి జీవితం వారిని ఎన్ని రకాలుగా కుంగదీస్తుందో ఎవరికి తెలుసు? అందమైన కళ్లు ఎన్నిసార్లు ఎదురైతేనేమిటి? ఆ కళ్లల్లో కల్లోలాలు, లీలగా తిరిగే కన్నీళ్లే కనపిస్తుంటే, ఆ కళ్లల్లో ఆనంద తీరాల్ని చూసే అవకాశం ఎలా ఉంటుంది? ఈ పరిస్థితి ఎప్పటికీ మారదని ఎప్పటికప్పుడు తేలిపోతుంటే ఏమైపోవాలి? ఒక్కగానొక్క జీవితం ఇలా చిందరవందర అయిపోయిందేమిటా అన్ని మనసు చింతిల్లదా? ఒకానొక దశలో విసిగి వేసారి, అసలు సుఖదుఃఖాలకు సంబంధమే లేని పూర్తిగా వేరైన మరో జీవితాన్ని వెతుక్కోవాలని అనిపించదా? తీరా అలాంటి మరే జీవితాన్నో వెతుక్కున్నాక ‘‘నీదీ ఒక బతుకేనా? ఇదీ ఒక జీవితమేనా?’’ అంటూ నిప్పుల వ ర్షం కురిపిస్తుంటే పాపం ఆ జీవుడు ఏంమాట్లాడతాడు? దిక్కులు చూస్తూ నిలుచోవడం తప్ప ఏం సమాధానం చెబుతాడు? ఆ రోజున ఆ మనసుతో మనసు కలిపే ఉంటే ఈ రోజున ఇలా మాట్లాడే అవసరమే ఉండేది కాదు కదా! ఒక్క అడుగు ముందుకేసి హృదయాన్ని పరిచే ఉంటే ఆ కథే వేరుగా ఉంటుంది...! ఆ కావ్యమే వేరుగా ఉంటుంది!
ముఝే క్యా గరజ్‌ కిసీసే, హసే ఫూల్‌ యా సితారే
హైఁ మేరే నజర్‌ మే కితనే, యే జవాఁ జవాఁ నజారే
అగర్‌ ఆప్‌ ముస్కురాతే తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ
తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ / మేరే జిందగీ మే ఆతే............ /
(పూలు నవ్వితే నే! తారలు నవ్వితేనే! వాటితో నాకు పనేమిటి?
అవేమీ కొరగాని నేను చూసిన ఎన్ని నవయవ్వనపు సుందరసీమల్లేవు?
నువ్వే ఒక్క మందహాసం చేసి ఉంటే ఆ సంగతే వేరుగా ఉండేది
ఆ సంగతే వేరుగా ఉండేది / నా జీవితంలోకి నువ్వే వచ్చి ఉంటే /)
ఏ రకంగా జీవించినా మనల్ని చూసి హేళనగా నవ్వుకునే వాళ్లుంటారు. అదే సమయంలో మనం అనుకున్న లక్ష్యం, దాన్ని చేరుకోవడానికి మనం ఎంచుకున్న మార్గం ఎంతో ఉన్నతమైనదీ, ఉత్కృష్టమైనదీ అని అభినందించే వాళ్లూ ఉంటారు. నిజానికి ఈ ఇద్దరిలో ఎవరూ ముఖ్యం కాదు. వీళ్ల వ్యాఖ్యానాలూ ముఖ్యం కాదు. అనుక్షణం నీతో నడిచే నీ అంతరాత్మే అన్నింటికన్నా ముఖ్యం. లేదా నీ ఆత్మలో ఆత్మగా ఉన్న నీ ప్రేమమూర్తే ముఖ్యం. ఆమె చేసే వ్యాఖ్యానాలే నిఖార్సయినవి. నిజమైనవి. లోకం ఎన్ని రకాలుగా మాట్లాడినా కుంగిపోకుండా, నీ వైపు చూస్తూ ఆ ప్రేమమూర్తి ఒక మందహాసం చేస్తే ఈ మహీతలమే నీ సొంతమైనట్లు. ఆ మహీతలానికి నువ్వే రారాజువైనట్లు, చక్రవర్తివైనట్లు. కానీ, అందరిలాగే లోకపు వ్యాఖ్యలకు జడిసి, నీ వైపు అడుగులు వేయడానికే జంకి, ముఖం దాచేసుకుని తన దారిన తాను వెళ్లిపోతే.....! వేలాది లక్షలాది జీవితాల్లో ఇదేగా జరుగుతోంది? అలా కాకుండా, లోకాన్నే ఏకాకిని చేసి నీ చేయందుకుని నడిస్తే, మందహాసాల కుంభవృష్టి కురిపిస్తే....! ఎంత బావుంటుంది. కానీ, అలా జరగడం లేదే! అదే జరిగితే ఆ కథే వేరుగా ఉంటుంది! ఆ కావ్యమే వేరుగా ఉంటుంది!
యే ఖుషీ రహే సలామత, యూఁహీ జష్న్‌ హో సుహానా
జిసే సున్‌రహీ హై దునియా, మేరే దిల్‌ కా హై తరానా
మేరే సాథ్‌ తుమ్‌ భీ గాతే, తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ
తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ / మేరే జిందగీ మే ఆతే............/
(నీ సంతోషం అలా సుభిక్షంగా ఉండిపోనీ - ఈ ఉత్పవం సుశోభితం కానీ
ఈ లోకం వింటున్నదంతా నా హృదయ గానమే సుమా
నాతో కలిసి నువ్వూ పాడి ఉంటే ఁ ఆ సంగతే వేరుగా ఉండేది
ఆ సంగతే వేరుగా ఉండేది - నా జీవితంలోకి నువ్వే వచ్చి ఉంటే)
దారులు శాశ్వతంగా వేరైపోతున్నాయని తొలిసారిగా తెలిసినప్పుడు హృదయాలు దావానలమైపోవడం సహజమే. కలల సౌధమంతా కాలి కూలిపోవడమే సహజమే. కానీ, ఏ మంటలైనా ఎంత కాలం ఉంటాయి? రోజులు, నెలలు పట్టవచ్చు. ఒక్కోసారి ఏళ్లు పట్టవచ్చు. కానీ, ఎప్పటికైనా ఆ మంటలు చల్లారిపోవడం ఖాయం. తాను కోల్పోయిన వారి తాలూకు జ్ఞాపకాల్లో మనసు ఏదోలా సేద తీరడమూ ఖాయం. ఆ తర్వాత కూడా జీవితంలో ఉండవలసినవన్నీ లేకుండాపోయాయే అన్న బాధైతే ఉండవచ్చు కానీ, గత జీవితంలో ఉండాల్సినవైతే ఉన్నాయి కదా ! అన్న ఊరట ఒకటి కలుగుతుంది. ఓదార్పు కలుగుతుంది. ఆ ఓదార్పులో అప్పుడప్పుడు తనను తాను ఊయల్లో ఊపుకొనేందుకు, లలిత లలితంగా మన గొంతులోంచి ఒక లాలిపాట పుట్టుకు రావచ్చు. ఆ పాట మాధుర్యంలో మనసు ఒకింత ఊరడిల్ల గలిగితే అంతకన్నా ఏం కాంవాలి? ఆ ఘడియలు అలాగే కొనసాగాలని ఎవరైనా కోరుకోవాలి. కాకపోతే ఆ పాడే సమయంలో తాను కూడా ఉంటే గొంతు కలిపేది కదా అనిపిస్తుంది. ఏక గళంలో కాకుండా యుగళ గీతమై మార్మోగేది కదా అనిపిస్తుంది. కానీ, అలా ఎంతగా ఎదురు చూసినా కొన్ని జీవితాల్లో ఏ ఫలితమూ ఉండదు. తన ఎదురు చూపే తన ఎదురుగా నిలుస్తుంది. అలా కాకుండా ఆమే తన జీవితంలోకి వచ్చి ఉంటే ఆ కథే వేరుగా ఉంటుంది! ఆ జీవన కావ్యమే వేరుగా ఉంటుంది!
... బమ్మెర

Wednesday, September 14, 2016

సంసార్‌ సేభాగే ఫిర్తే హో - Samsar se bhage phirthe ho - Chitralekha movie - aashabomsle song



నేల తెలియకపోతే...ఆకాశం ఎక్కడిది?


నిశ్శబ్దాన్ని ప్రశాంతత అనలేం. ఫళాయనాన్ని పారమార్థికత అనలేం. ఓటవెుౖనా,గెలుపైనా అవి యుద్ధ భూవిులో దిగిన వాడికే గానీ, దూరంగా నిలుచుని దిక్కులు చూసే వాడికి కాదు కదా! సముద్రయానంలోని సంతోషం ఏవిుటో, సంఘర్షణేమిటో పడవెక్కిన వాడికే తెలుస్తుది గానీ, ఒడ్డున కూర్చున్న వాడికి కాదు కదా! సముద్రం నుంచైనా, సమర భూమి నుంచైనా జీవిత పాఠాలు నేర్చుకునేది, పరిపూర్ణ జీవన సౌందర్యాన్ని దర్శించేది జీవన పోరాటాల్లో పాలు పంచుకునవాళ్లే. ఆకాశంలోకి ఎగరాలనుకునే విమానం ముందు నేలమీద పరుగులు తీయాల్సిందే. అసలు సిససలైన ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాలనుకునే ఎవరైనా భౌతిక జీవిత సత్యాల్ని తరచి చూడాల్సిందే . అందుకోసం పరోక్షంగానే కాదు. ప్రత్యక్షంగానూ ప్రపంచ గమనంలో పాలు పంచుకోవడం తప్పనిసరి అవుతుంది. ‘చిత్రలేఖ’ సినిమా కోసం సాహిర్‌ లుథియాన్వి రాసిన ఈ పాటలో ఈ ప్రబోధవేు ప్రతిధ్వనిస్తుంది. రోషన్‌ సంగీత దర్శకత్వంలో దాదాపు ఐదు దశాబ్దాల కిత్రం లతామంగేష్కర్‌ గానం చేసిన ఈ గీతం ఇప్పటికీ మానవ జీవితాల్లో జ్ఞానజ్యోతుల్ని వెలిగిస్తూనే ఉంది. 
* * * * *
సంసార్‌ సే భాగే ఫిర్తే హో - భగ్‌వాన్‌ కో తుమ్‌ క్యా పావోగే 
ఇస్ లోక్‌ కో భీ ఆప్ నా న సకే - ఉస్ లోక్ మే  భీ పఛ్‌తావోగే /సంసార్‌ సే/ 
(భవలోకాన్నించి పారిపోవాలని చూసేనువ్వు భగవంతుణ్ని ఎలా పొందుతావు? 
ఈ లోకాన్నే అందుకోలేని నువ్వు ఆ లోకంలో కూడా పశ్చాత్తాపపడతావు) 
భవబందాల్ని అధిగమించి ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాలి. అంతే గానీ ఆ బంధాలకు వెరిసి వాటి నుంచి పారిపోయి కాదు.అయినా కళ్లముందున్న భౌతిక ప్రపంచాన్నే అందిపుచ్చుకోలేని వాడు కంటికి కనిపించని అభౌతిక లోకాన్ని, ఆ భగవతుణ్ని ఎలా దర్శించుకోగలడు? చేతికంది చేతుల్లోకి వచ్చేసే ఈ ప్రత్యక్ష లోకంలోనే ఏవీు చేయులేనివాడు ఆ లోకంలో మాత్రం ఏంచేస్తాడు? అడుగడుగునా పశ్చాత్తాపపడటం ప్ప. అయినా భౌతికత్వానికీ, అభౌతికత్వానికీ ధ్యన రేఖ గీసిందెవరు? ఈ రెండూ వేరు వేరని చెప్పిందెవరు? నిజానికి ఈ రెండూ ఒకే రూపపు వేరువేరు పార్శ్వాలు కదా!. ఒకే మార్గపు వేరు వేరు చివర్లు కదా! అందువల్ల ఈ చివరనుంచి మార్గంలో అడుగెడితేనే ఎవరైనా ఆ చివరకు చేరతారు. భౌతిక సీమలోంచి నడిస్తే తప్ప ఎవరూ భగవంతుని సన్నిధానాన్ని చేరుకోలేరు. అందువల్ల ఎవరికైనా నిజంగానే దైవాన్ని చేరుకోవాలని ఉంటే , వారు భువనలోకం లోంచి పయనించాల్సిందే. అందుకు విరుద్ధంగా వాటన్నింటి నుంచి పారిపోవాలని చూసేవారు జీవితంలో సాధించేదేమీ ఉండదు. 

యే పాప్ హై క్యా, యే పుణ్య్‌ హై క్యా - రీతోఁ పర్‌ ధర్మ్‌ కీ వెుుహరే హైఁ 
హర్‌ యుగ్‌ బదల్‌తే ధర్మోం కో కైసే ఆదర్శ్‌ బనావోగే / సంసార్‌ సే/ 
(ఈ పాపాలేమిటి? పుణ్యాలేమిటి? ఈ ఆచారాల పైన ధ ర్మాల ముద్రలున్నాయి 
యుగయుగానికీ మారే ధర్మాల్ని ఎలా ఆదర్శంగా తీసుకుంటావు?) 
మానవ సమాజం నిరంతరం మారుతూ ఉంటుంది. దాని ఆచారాలూ, ధర్మాలూ మారుతూ ఉంటాయి. ఒకనాడు సతీసహగమనానికి జోహార్లు పలికిన సమాజమే ఆ తర్వాత కాలంలో అది అమానషమైన ఆచారమంటూ తూలనాడింది. వితంతు వివాహాన్ని మహా పాపకార్యమన్న సమాజమే ఆ తర్వాత కాలంలో అందుకు సిద్ధపడ్డ వారికి నీరాజనాలు పలికింది. అయినా, ఒక నిండైన జ్ఞానం లోంచి పుట్టుకొచ్చినదైతే అది వేరే మాట. అలా కాకుండా, ఎవరి ఆధిపత్యం కోసమో రూపొందిన, ఒక తెగకో, ఒక జాతికో, ఒక ప్రాంతానికో చెందిన ఏ వర్గ ప్రయోజనాల కోసమో సిద్ధమైన ఆచారాలనూ, ధర్మాలనూ ఎవరైనా ఎందుకు నెత్తినెత్తుకోవడం?  ధర్మాల గురించి ఎందుకు? ఎవరి స్వార్థ చింతనలోంచో, ఎవరి అమానుషత్వంలోంచో పుట్టుకొచ్చిన నియమాలను ఎవరైనా ఎందుకు ఆదర్శంగా తీసుకోవడం? అవైనా స్థిరంగా ఉంటాయా అంటే అవి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. తమ ఉనికినీ, స్వరూప స్వభావాలనూ మార్చుకుంటూ వెళతాయి. అలాంటి మహా చంచలమైన వాటి ఆధారంగా ఏది పుణ్యమో, ఏది పాపమో ఎలా నిర్ధారిస్తారు? ఆ నిలకడలేని వాటిని ఎంచుకుని నువ్వెక్కడ నిలకడగా ఉండగలవు? మనిషన్నవాడు అఖండంగా, అనంతంగా వ్యాపించాలి ఏ ఒక్కతెగకో, జాతికో మేలు కలిగేలా మొగ్గు చూపకుండా, సమస్త ప్రాణికోటినీ సమదృష్టితో చూసే జ్ఞానదృష్టిని సముపార్జించాలి. విశ్వమానవుడిగా, విశ్వప్రేమికుడిగా జీవించగలగాలి. 

యే భోగ్‌ భీ ఏక్‌ తపస్యా హై - తుమ్‌ త్యాగ్‌ కే మారే క్యా జానో 
అప్‌మాన్‌ రచేతా కా హోగా, రచ్‌నా కో అగర్‌ ఠుక్‌రావోగే /సంసార్‌ సే / 
( ఈ భోగ్యం కూడా తపస్సేనని- ఓ త్యాగపీడితుడా నీకేం తెలుసు? 
సృష్టిని తృణీకరిస్తున్నావంటే అది సృష్టికర్తను అవమానించడమే) 
కనపించే భౌతికాలన్నీ హీనమైనవి, కంటి కి కనిపించని అభౌతికాలే ఉన్నతమైనవి అంటే ఎలా ? మంచు కరిగితే నీరవతుంది. నీరు మరిగితే ఆవిరవుతుంది. క నిపించని ఆవిరి పవిత్రమైనప్పుడు వాటికి మూలమైన మంచు, నీరు అపవిత్రం ఎలా అవుతాయి? శరీరమే లేకపోతే, మనసెక్కడిది? ఆత్మ ఎక్కడిది? ఆ పైవాన్నింటికీ శ రీరమే మూలభూతం కదా! మూలభూతాన్నే కదా దైవం అంటాం. అయినా గుండెనూ, గుండె స్పందనలనూ ఎవరైనా ఎలా వేరు చేస్తారు? రక్తమాంసాల్నీ, ప్రాణాన్నీ ఎలా వేరు చేస్తారు? శరీరం, ఆత్మ వేరు వేరు కాదు. భౌతికం, అభౌతికం వేరు వేరు కాదు. ఆ రెండూ ఒకే సత్యపు రెండు పార్శ్వాలు అని చెప్పడానికే కదా అరవిందో ‘ఇంటెగ్రల్‌ ఫిలాసఫీ’ని ప్రతిష్టాపించాడు. ఇవేమీ వినకుండా, కనకుండా, ఎవరైనా, భౌతికమైనవన్నీ పాపాత్మకాలు, అభౌతికమైన వన్నీ పుణ్యాత్మకాలు అంటే ఏమనగలం? సృష్టికర్తను ఆరాధిస్తూనే, ఆయన సృష్టిని ఏవగించుకుంటే ఏమిటి అర్థం? అది ఆ సృష్టికర్తను అవమానించడం కాదా? అన్నం భౌతిక పదార్థమే కదా! అలాంటప్పుడు ‘ అన్నం పరబ్రహ్మం’ అని ఎలా అన్నారు జ్ఞానులు. సర్వసంగ పరిత్యాగం ఒక్కటే పరమధర్మం అని ఎవరెనా అనుకుంటే ఏమనగలంలే గానీ, నిజానికి, ఈ భౌతిక రూపాలన్నీ, ఈ భోగభాగ్యాలన్నీ పవిత్రమైనవే.వాటిని ఆస్వాదించడం పరమ పవిత్రకార్యమే, తపస్సుతో సమానమే. 

హమ్‌ కహెతే హై యే జగ్‌ అప్‌నా హై - తుమ్‌ కహెతే హో ఝూటా సప్‌నా హై 
హమ్‌ జనమ్‌ బితాకర్‌ జాయేంగే, తుమ్‌ జనమ్‌ గఁవాకర్‌ జావోగే /సంసార్‌ సే/ 
(మేమేమో ఈ లోకం మాదేనంటాం. నువ్వేమో అంతా ఒక అబద్దపు కల అంటావు 
మేము జీవితాన్ని గడిపేసి పోతాం - నువ్వేమో జీవితాన్ని కోల్పోయి వెళ్లిపోతావు) 
ప్రళయకాలం ఎప్పుడో వస్తుందని, అప్పుడు ప్రపంచమంతా మునిగిపోతుంద ని ఇప్పుడెండుకు ఏడుపు? విశ్వపు ఆది ఘడియల్ని నువ్వు చూడలే దు. దాని అంతిమ ఘడియల్నీ నువ్వు చూడలేవు. నువ్వు ఉండని, నువ్వు చూడలేని ఆ ఎప్పటి పరిణామాలో ఊహించుకుని శూన్యమొక్కటే సత్యం. ప్రపంచమంతా ఉత్త మాయ అంటూ విశ్వాంత కావ్యాన్ని పారాయణం చేయడం ఎందుకు? ఆ మాట అలా ఉంచి, విశ్వం అంతమై తీరుతుందని అంత కచ్చితంగా చెప్పిందెవరు? ఆ సెలవిచ్చిన పెద్దాయన ఇప్పటికి ఎన్ని విశ్వాంతాల్ని చూశాడు? అయినా, విశ్వకాలం అంటే ఏమిటి? నీ జీవితకాలమే విశ్వకాలం. నువ్వున్నంత కాలం విశ్వం ఉంటే అది ఉన్నట్లే, నువ్వే లేకుండా పోయాక విశ్వం ఉన్నదేం తెలుస్తుది? లేకుండా పోయిందేమి తెలుస్తుంది? ఈ రోజున, ఇప్పుడు, ఈ క్షణాన నువ్వు ఉన్నావు. లోకం ఉంది. ఇది సత్యమే... పరమ సత్యమే. ఈ సత్యాన్ని గుర్తించిన వారంతా లోకం తమదే అనుకుంటారు. ఆ లోకంలో మమేకమవుతారు. తాదాత్మ్యత పొందుతారు. క్షణక్షణం, అణువణువునా ఆకాశాన్ని చూస్తారు. నక్షత్ర మండలాన్ని చూస్తారు. సూర్యచంద్రుల్ని చూస్తారు. సముద్రతరంగాల్ని చూస్తారు వాటి సంగీతాన్ని వింటారు. అన్నింటినీ మించి జీవితపు అమృతభాండాన్ని అమాంతంగా లేవనెత్తి గుండెనిండా నింపుకుంటారు. ఈ లోకం అబద్ధం కాదు, మాయ కాదు. పరమసత్యం అంటూ పరవశంతో గానం చేస్తారు. ఒకటి మాత్రంనిజం....ఈ లోకమంతా అబద్దం అనుకునే వారంతా అక్షరాలా జీవితాన్ని పోగొట్టుకుని వెక్కివెక్కి ఏడుస్తూ వెళిపోతారు. అలా కాకుండా, ఈ లోకాన్ని సత్యమని, పరమసత్యమని గుర్తించిన వారు జీవితపు మహార్ణవ సౌందర్యాన్నీ, దివ్య మాధుర్యాన్నీ పొందుతారు. చివరికి ఒక రోజున పంచభూతాల్లో కలిసిపోయినా, విశ్వగీతాన్ని ఆలపిస్తూ ప్రపంచం ఉన్నంత కాలం వినువీధిలో తిరుగాడుతుంటారు. 
- బమ్మెర