Sunday, July 31, 2016

జానెవాలో జరా, ముడ్‌ కే దేఖో ముఝే - Jaanevalo zara mudke deko mujhe -


నేనూ మీలాంటి మనిషినే........!


మన పక్కనుంచి వెళుతున్నవాడు కూడా మనిషే, మన వాడే, మనలో భాగమే అనుకునే పరిస్థితిలో అన్నిసార్లూ మనం ఉండం. ఎందుకంటే పక్కవాడు మనలా లేడు. మనలా ఆలోచించడం లేదు. మనలా మాట్లాడటం లేదు. మనలా జీవించడం లేదు. అందుకే మనమూ, వాడూ వేరువేరనుకుంటాం. అందుకే ఎవరి బతుకులు వారి బతుకుతూ ఎవరి దారిన వారు వెళ్లిపోవడమే మేలనుకుంటాం. అందుకే అందరి మధ్య ఉంటూనే చాలాసార్లు ఒంటరి భావనతో ఉండిపోతాం. అన్నీ సానుకూలంగానే ఉన్నప్పుడు ఎవరినుంచి విడిపోయినా ఏమీ అనిపించకపోవచ్చు. కానీ, ఏ సమస్యో వచ్చినప్పుడు, ఏ సంక్షోభంలోనో పడిపోయినప్పుడు కనీసం ఒక్క మనిషైనా తోడుగా లేడే అని దిక్కులు పిక్కటిల్లేలా పిలుస్తాం. కానీ, అందరినుంచీ ఎప్పుడో విడిపోయిన మన గొంతును ఇప్పుడు ఎవరు వింటారు? ఎప్పుడైనా, ఎక్కడైనా ఎదుటివారి పిలుపునకు బదులిస్తేనే కదా!, మన పిలుపునకు ఎదుటి వారు బదులిస్తారు!. ‘ దోస్తీ’ సినిమా కోసం ఆనంద్‌ బక్షీ రాసిన ఈ పాట ఈ సందేశమే వినిపిస్తుంది. లక్ష్మీకాంత్‌- ప్యారేలాల్‌ బాణీలో ఒదిగిపోయిన రఫీ గొంతు సైతం ఎంతో ఉద్వేగంతో ఆ సందేశాన్ని లోకమంతా వెదజల్లుతుంది. 
* * * * * 

జానెవాలో జరా, ముడ్‌ కే దేఖో ముఝే 
ఏక్‌ ఇన్‌సాన్‌ హూఁ, మై తుమ్హారీ తర్హా 
జిస్‌నే సబ్‌ కో రచా, అప్‌నే హీ రూప్‌ సే 
ఉస్‌ కీ పహెచాన్‌ హూఁ మై తుమ్హారీ తర్హా / జానే వాలో/ 
(ఓ బాటసారులారా! కాస్త వెనుతిరిగి నన్ను చూడండి 
మీకు మల్లే నేనూ ఓ మనిషినే 
ఎవరు తన రూపంతో మనందరినీ సృష్టించాడో 
మీకు మల్లే నేనూ ఆయన గుర్తునే) 
నీ మనసే నీ ప్రపంచమైనప్పుడు, నీ జీవిత మే నీ సమస్తమైనప్పుడు నీ ఆవల ఏం జరుగుతున్నా నీకేమీ పట్టదు. అవతల ఎందరో అరుస్తుంటారు, ఆక్రోశిస్తుంటారు అయినా అవేవీ నీ మనసుకు ఎక్కవు. ఎందుకంటే నీ జీవితమే నీకు గానీ అవతలి వారి జీవితంతో నీకేం పని? వాళ్లేమైపోతే నీకేమిటి బాధ? ఎవరైనా బాహ్య ప్రపంచం నుంచి విడిపోతే, మానవాళి అంతా మటుమాయమైపోతే, తానొక్కడే మనిషి ఈ లోకపు సృష్టి తానొక్కడే. తన చుట్టూ ఉన్నవేవీ ఏమీ కావు. తన చుట్టూ ఉన్నవారెవరూ మనుషులూ కాదు మానులూ కాదు. పైగా ఈ సృష్టి గానీ,
సృష్ట్టికర్తగానీ నీకు మాత్రమే ప్రాణం పోసినట్టు, ఈ సృష్టినంతా నీకే దారాధత్తం చేసినట్లు భ్రమిస్తావు. వాస్తవానికి, ఏ పంచభూతాత్మక శక్తి నిన్ను సృష్టించిందో, సమస్త చరాచర జగ త్తునంతా ఆ శక్తే కదా సృష్టించింది. అలాంటప్పుడు నువ్వొక్కడివే మనిషైనట్లు మిగతా ఎవరూ ఏమీ కానట్లు ఉండిపోతావెందుకని? పక్కవాడు గుండెలు బాదుకుంటున్నా, పట్టనట్లే వెళ్లిపోతావెందుకని?
ఇస్‌ అనోఖే జగత్‌ కీ మై తక్‌ధీర్‌ హూఁ 
మై విధాతా కే హాథో కీ తస్‌వీర్‌ హూఁ 
ఇస్‌ జహాఁ కే లియే, ధర్‌తీ మా కే లియే 
శివ్‌ కా వర్‌దాన్‌ హూఁ మై తుమ్హారీ తర్హా / జానేవాలో/ 
(ఈ సుందర లోకపు జాతకాన్ని నేను 
సృష్టికర్త చేతుల్లోని చిత్రపటాన్ని నేను 
ఈ లోకం కోసం, ఈ భూమాత కోసం ఏతెంచిన 
మీలాగే శివుని వరప్రసాదాన్ని నేను) 
తన అస్తిత్వం, గురించి తానే చెప్పుకోవాల్సి రావడానికి మించిన దురదృష్టం మానవ జీవితంలో మరేముంటుంది. కానీ, ఎదుటి వాళ్లు తన ఉనికిని అసలే పరిగణనలోకి తీసుకోనప్పుడు తనను తానే పరిచయం చేసుకోక తప్పదుగా! లేదంటే తనకింక మనుగడే ఉండదు మరి! నిజానికి సృష్టికి ప్రతిసృష్టి చేచగలిగే మానవుడు ఈ సుందర జగత్తు పాలిటి సౌభాగ్యమూర్తే నువ్వే కాదు సమస్తమానవులూ సౌభాగ్యమూర్తులే. సృష్టికర్త చేతిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన చిత్ర కళాకండాలే. భూతలం కోసమే కావచ్చు. సమస్త జగత్తు కోసమైనా కావచ్చు. నీలాగే నాలాగే ప్రతి మనిషీ ఈ లోకానికి శివప్రసాదంగా సిద్ధించినవారే. అందువల్ల నీవొక్కడివే ఈ లోకానికి ఏదైనా చేయగలుగుతావన్నట్లు, మిగతా ఎవరివల్లా ఏమీ కాదన్నట్లు వ్యవహరిస్తే ఏలా? మనుషుల్లో అంతస్తుల వ్యత్యాసాలు ఉండవ చ్చు. హోదాల్లో తేడాలు ఉండవచ్చు. అయితే ఇవన్నీ భౌతిక లోకంలోనే తప్ప, జ్ఞాన లోకంలో ఇవి ఎందుకూ కొరగావు. అందుకే జ్ఞానవంతులు, ఈ తేడాల్ని ఏమాత్రం పట్టించుకోరు. పైగా మనుషులందరినీ సృష్టిలోని దివ్యత్వంలో భాగంగానే చూస్తారు. తన ఆత్మలోనూ భాగంగానే చూస్తారు. అంటే సాటి మనిషి ఎవరైనా కష్టాల్లో ఉంటే కన్నీరుమున్నీరవుతారు. అండగా నిలుస్తారు. చేయందిస్తారు. చేయిపట్టుకుని నడిపిస్తారు.
మన్‌ కే అందర్‌ ఛుపాయే మిలన్‌ కీ లగన్‌ 
అప్‌నే సూరజ్‌ సే హూఁ ఏక్‌ బిఛ్‌డీ కిరణ్‌ 
ఫిర్‌ రహా హూఁ భటక్‌తా మై యహాఁ సే వహాఁ 
ఔర్‌ పరేశాన్‌ హూఁ మై తుమ్హారీ త ర్హా / జానేవాలో/ 
(కలుసుండే కాంక్షను మనసులోనే దాచేసుకుని 
సూర్యున్నించి విడిపోయిన కిరణాన్ని నేను 
బాటతప్పి ఇటూ అటూ తిరుగుతున్నాన్నేను 
మీకు మల్లే మహా చింతాక్రాంతుణ్నయ్యాన్నేను) 
చెప్పడానికి వెనకాడతాం గానీ ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరమూ మన ఆశాసౌధాల్లోంచి దూరంగా విసిరేయబడి కటిక చీకట్లో కాలిపోరున వాళ్లమే. జీవనయానంలో కాటు కలిసి అటూఇటూ తిరుగుతున్న వాళ్లమే. ఎవరికెవరమూ తీసిపోని రీతిలో అంతు చిక్కని ఆందోళనలో అందరమూ అల్లకల్లోలమవుతున్న వాళ్లమే. అందువల్ల ఇక్కడ ఎవరినో చూసి ఎవరూ తలవంచుకుని వెళ్లాల్పిన అవసరం లేదు. ఎవరినుంచి ఎవరూ తప్పించుకు తిరగాల్సిన అవసరం లేదు. అందరి జీవితాలూ ఇక్కడ తెరిచిన పుస్తకాలే. పైపైన కనపడే రంగులు వేరు వేరు కావచ్చు గానీ, లోపలున్న అందరి మూలాలూ ఒకటే. కష్టాలకూ కన్నీళ్లకూ ఎవరూ అతీతులు కారు. ఇక్కడ అఖండమైన ఆనందమూర్తులెవరూ లేరు. అయినా బాఽధా తప్త హృదయులు నేరస్తులేమీ కాదు. వాటిని అధిగమించే ఏ ప్రయత్నమూ చేయకపోవడాన్ని నిలదీయవచ్చులే గానీ, బాధల్ని అభివ్యక్తం చేయడాన్నే అడ్డుకోవడం కచ్ఛితంగా నేరమే అవుతుంది.
మేరే పాస్‌ ఆవో ఛోడో యే భరమ్‌ 
జో మేరా దుఃఖ్‌ వహీ హై తుమ్హారా భీ గమ్‌ 
దేఖ్‌తా హూఁ తుమ్హే, జాన్‌తా హూఁ తుమ్హే 
లాఖ్‌ అంజాన్‌ హూఁ మై తుమ్హారీ తర్హా 
(భ్రమలన్నీ వదిలేసి నా చెంతకు వచ్చేయండి 
ఏ దుఃఖం నాలో ఉందో, ఆ దుఃఖం మీలోనూ ఉంది 
మిమ్మల్ని చూస్తూనే ఉన్నా, మీరేమిటో తెలుసున్నా 
లక్షలాది మందితో మీలాగే నిర్లక్ష్యమైపోయాన్నేను) 
ఎవరికి వారు తామేదో అతీతులమన్న భ్రమలో ఉంటారు. పక్కనున్న ఏ ఒక్కరితోనూ తమకు పోలికే లేదనుకుంటారు. కానీ, కొమ్మలు వేరు వేరుగా కనపడినా, వృక్షపు కాండం ఒక్కటే కదా! మనుషులైనా తమ అంత స్తుల రీత్యా, హోదాల రీత్యా భిన్నంగా కనపడవచ్చేమో గానీ, వారి ఆవేదనలూ, ఆత్మక్షోభలూ, దుఃఖాలక్షౌ ఏమైనా తేడా ఉంటుందా? శరీరాల రంగూ, రూపూ వేరు కావచ్చేమో గానీ, వాటన్నింటి నిద్ర ఒక్కటే. మరణం ఒక్కటే. నిదురోయాక నాకు నేనుండను. నీకు నీవుండవు. ఎవరికీ తన దంటూ ఏదీ ఉండదు. మరణమూ అంతే అది ఎవరికీ సడలింపులూ, మినహాయింపులూ ఇవ్వదు. మళ్లీ వచ్చి ఆగిపోయిన పనుల్ని పూర్తిచేసే అవకాశం ఎవరికీ ఇవ్వదు. ఎవరైనా అంతిమంగా వెళ్లేది శూన్యారణ్యంలోకే. ఇన్నిన్ని సారూప్యాలు ఉన్నప్పుడు. మనుషులింకా దాచిపెట్టుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికీ ఏముంది? అయినా, ఒకరినుంచి ఒకరు దూరదూరంగా వెళ్లిపోవాలనుకుంటారు? ఒకరినొకరు ఉపేక్షిస్తూ, లోకంలో అందరికందరూ అనామకులుగా మిగిలిపోతారు. ఎవరికీ ఎవరూ పట్టక నిర్లక్ష్యమైపోతారు. ఈ దౌర్భల్యం నుంచి మనిషి బయటపడేదెన్నడో!! అందరితో కలిసిపోయి అందరిలో వ్యాపించి అనంతంగా జీవించేదెన్నడో!!


....బమ్మెర 

Tuesday, July 12, 2016

దిల్‌ మే కిసీ కే ప్యార్‌ కా జల్‌తా హువా దియా - Dil Me kisi ke pyaar ka jaltha hua diya


పెనుగాలి వీస్తే, ప్రేమకేమవుతుంది? 


 * * * * *   

రెండు హృదయాలు కలిసి వెలిగించిన ప్రేమజ్యోతిని చూసి నిండుగా ఆశీర్వదించాలి కదా ఎవరైనా! కానీ, చాలా సార్లు జరుగుతున్నదేమిటి? లోకం కుళ్లుకుంటుంది. దాని కళ్లు నిప్పులు కక్కుతాయి. ఆ నిప్పురవ్వలు మహామంటలై ఎగిసిపడటానికి లోకం పెనుగాలుల్ని ఎగదోస్తుంది. ఉప్పెనల్ని ఉసిగొలుపుతుంది. ఒక్కోసారి తనవాళ్లనుకున్న వాళ్లు, కడదాకా తనతో కలిసి నడుస్తారనుకున్న వాళ్లు సైతం ఆ లోకం గొంతులో గొంతు కలుపుతారు. తమ గతమంతా మరిచిపోతారు. అయినా నిజమైన ప్రేమలు వెనుకంజవేయవు. ఆ ప్రేమనుంచి వైదొలగిపోవు పైగా, గుండెలోని ఆ ప్రేమను ఒక మహాజ్వాలను చేస్తాయి. మహీతలాన్నంతా కాంతిమయం చేస్తాయి.. ‘ఏక్‌ మహల్‌ హో సప్‌నోంకా’ సినిమోకోసం సాహిర్‌ లుధ్యాన్వీ రాసిన ఈ పాటలో ఈ సత్యాలే ప్రతిధ్వనిస్తాయి. రాగజలపాతాల రవి సంగీత దర్శకత్వంలో లతా మంగేశ్కర్‌ ఐదు దశాబ్దాల క్రితం గానం చేసినీ ఈ పాట తరగని తాజాదనంతో భారతీయ హృదయాల మీద ఇప్పటికీ తారట్లాడుతూనే ఉంది. 
* * * * * *  
దిల్‌ మే కిసీ కే ప్యార్‌ కా జల్‌తా హువా దియా 
దునియా కీ ఆంధియోఁ సే భలా యే బుజేగా క్యా /దిల్‌ మే/ 
(గుండెలో మండుతున్న ప్రేమ జ్యోతి ఎవరిదైనా 
లోకపు పెనుగాలులతో చల్లారిపోతుందా ఎపుడైనా?) 
‘‘లోకంలో ఆనందం ఒక్కటే సత్యం. దుఃఖాలన్నీ కల్పితాలే ’’అంటూ ఉంటారు. ఆ మాటకొస్తే, ‘‘లోకంలో ప్రేమ ఒక్కటే సత్యం. ద్వేషాలన్నీ కల్పితాలే.’’ ద్వేషాలు వాటికవిగా ఉన్నవి కావు. దేనికో ప్రతిగా, వ్యతిరేకంగా పుట్టుకొచ్చినవి. మనిషే కావాలని పనికట్టుకుని పెంచిపోషించుకున్నవి. ద్వేషాలు అసత్యమైనవి, కృత్రిమమైనవి. కృత్రిమమైనవెప్పుడూ బలహీనమైనవే. అందుకే ప్రేమకున్న శక్తిలో వెయ్యోవంతు కూడా ద్వేషానికి ఉండదు. ప్రేమ అమృతమైతే, ద్వేషం విషం. ఈ ద్వేషపు విషం ఎదలోపల ఎంతో కాలం ఇమడలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఎగదన్నుకొస్తుంది. ఎదుటివారిని ధ్వసం చేయాలని చూస్తుంది. కొంత ప్రయత్నం కూడా చేస్తుంది కానీ, అతిమంగా ఓడిపోతుంది. మౌలికంగా, కలిసిపోయేదీ, కలిపేదీ, కలపాలనుకునేదీ ప్రేమ. విడిపోయేదీ, విడగొట్టేదీ, విడగొట్టాలనుకునేదీ, ద్వేషం. అయితే కలపాలనుకునే వాటికున్న శక్తిలో వెయ్యోవంతు కూడా విడగొట్టాలనుకునే వాటికి ఉండదు. నిలబెట్టాలనుకునే వాటికి ఉన్న శక్తిలో వెయ్యోవంతు కూడా పడగొట్టాలనుకునే వాటికి ఉండదు. సత్యానికి ఉన్న శక్తిలో వెయ్యోవంతు కూడా అసత్యానికి ఉండదు. అందుకే లోకంలో ఎప్పుడూ సత్యానిదే పై చేయి అవుతుంది. సత్యసంహితమైన ప్రేమదే పై చేయి అవుతుంది. ప్రేమ అంటే ఒక పరమసత్యం. ఒక అఖండ జ్యోతి. సత్యం అంటే అది వేయి సూర్యుళ్లకు సమానం. ప్రేమించే హృదయం వేయి ఆకాశాలకు సమానం. అందుకే ద్వేషాలు ఎంత ఎత్తున ఎగిసిపడినా, పెనుగాలులై విరుచుకుపడినా అవి అవి అఖండమైన ప్రేమ జ్యోతిని ఆర్పలేవు. ప్రేమ హృదయూన్ని కాల్చలేవు
సాసోం కి ఆంచ్‌ పాకే భడక్‌తా రహేగా యే 
 సీనేవేు దిల్‌ కే సాథ్‌ భడక్ తా రహేగా యే

వో నక్శ్‌ క్యా హువా జో విుఠాయేు సే విుఠ్‌గయా 
వో దర్ద్‌ క్యా హువా జో దబాయే సే దబ్‌గయా / దిల్‌ మే/
 (ఊపిరుల సెగలందుకుని ప్రజ్వలిస్తూనే ఉంటుంది 
ఎదలోపల గుండెతో పాటు కొట్టుకుంటూనే ఉంటుంది 
చెరిపేస్తే చెరిగిపోతే ఇంక ఆ ముద్ర ఏపాటిది? 
అణిచేస్తే అణిగిపోతే ఇంక ఆ బాద ఏపాటిది?) 
జీవితమంతా ఎప్పుడూ ఏదో రకమైన ఉప్పెనలూ,, సుడిగుండాలేకదా!, వీటి మధ్య ఈ ప్రేమ దీపం ఎంతకాలం నిలుస్తుందిలే అనుకోవడంలో అర్ధం లేదు. ఉఛ్వాస- నిశ్వాసల అగ్ని ధారలే అసరాగా అది జాజ్వల్యమానంగా వెలుగుతూనే ఉంటుంది. నువ్వున్నంత కాలం నేనూ ఉంటానంటూ గుండెను అంటి పెట్టుకుని నిండు సమద్రంలా సాగిపోతూనే ఉంటుంది. అయితే, ఎదురీదటవేు తెలియనప్పుడు ప్రవాహంలో ఏ చిన్న అల ఎగిసిపడినా గుండె గుభేలుమంటుంది. ఎక్కడ ఏ చిన్న మొసలి పిల్ల కనిపించినా ప్రాణాలు ఆగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఎదురీత తెలియని వాడిని ఎవరైనా ఈతగాడని ఎలా అంటారు? ఎదురుపడిన మొసలి మీదికి ఖడ్గం ఝలిపించని వాడు జీవితంలో ఏం తెలుసుకున్నట్లు? నువ్వు వెళ్లే మార్గం ఎంత సుదూరమైనదైతే నీ పాదముద్రలు అంత బలంగా పడతాయి. ఆ ముద్రలు ఎవరో తుడిచేస్తే పోయేవి కావు. నీ లక్ష్యం పట్ల నీ ప్రేమ ఎంత లోతైనదైతే, దాన్ని అందుకోవడానికి నీలో అంత లోతైన బాధ ఉంటుంది.. ఆ బాధ ఎవరో అణచివేస్తే అడుగంటిపోయేది కాదు.
యే జిందగీ భీ క్యా హై, అమానత్‌ ఉన్హీ కి హై  
యే శాయ్‌రీ భీ క్యా హై, ఇనాయత్‌ ఉన్హీ కి హై 
అబ్‌ వో కరమ్‌ కరే కె సితమ్‌ ఉన్‌కా ఫైస్‌లా 
హమ్‌నే తో దిల్‌ మే ప్యార్‌ కా శోలా హీ జగా లియా / దిల్‌ మే/ 
(ఏముంది ఈ జీవితం? అతని ఐశ్వర్యమే ఇది. 
ఈ కవిత్వమైనా ఏముంది? అతని ఆశీర్వాదమే ఇది ! 
ఇప్పుడు ఏ వంచనకు పాల్పడినా అదింక అతని నిర్ణయమే సుమా 
నేనైతే మనసులో ప్రేమజ్వాలనే జాగృతం చేశా ) 
ఎక్కడో పాతాళంలో పడి ఉన్న జీవితాల్ని కొందరు ఏ నక్షత్ర మండలానికో చేరుస్తారు. ఎడారిలో పడి ఉన్న ఇసుక రేణువుల్ని వజ్రతుల్యంగా మారుస్తారు. నిండు జీవితం నీదేనంటూ మనస్పూర్తిగా ఆశీర్వాదిస్తారు. జీవితాంతపు ఆసరాగా నిలుస్తానని బాసలు కూడా చేస్తారు. అప్పటికది నిజమే. ఆ నోటి ప్రతిమాటా అక్షర సత్యమే. కానీ అంతలోనే ఏమో అయిపోయినట్లు, ఏ విపరిణామాలో వచ్చిపడి అంతా తారుమారైపోవచ్చు. లోకపు ఒత్తిళ్లకు తలొగ్గి తాను నిర్మించిన సౌధాన్ని తానే కూల్చేయడానికి అన్నట్లు, ఏ విద్రోహానికో పాల్పడుతున్నట్లు ప్రతి అడుగూ విరుద్ధంగానే పడుతుంది. ప్రతి మాటా గుండెలో ఈటెలాగే దిగబడుతుంది. అయినా, అంతకుముందే అతని ప్రేమను స్వీకరించిన వాళ్లు వెనుకంజ వేయరు.‘‘అది అతడు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని నేనెందుకు కాదనాలి. ’’ అనుకుంటారు. నిజమే కదా! ఇప్పుడేదో అయిపోయిందని మనసు మార్చుకోవడం ఏమిటి? గతాన్నంతా మరిచిపోవడమేమిటి? అయినా, భూమధ్య రేఖలా భువనాన్నంతా చుట్టేసిన ప్రేమ వెనక్కి ఎలా వెళుతుంది.? వలయాలు వలయాలుగా భూతలాన్ని అన్ని వైపుల నుంచి ఇంకా ఇంకా అల్లుకుపోతుంది. గుండెలో ప్రేమ జ్వాలల్ని వేయి చేతులతో ఎగదోసుకుంటుంది. గగనతలమంతా ప్రతిధ్వనించేలా గంధర్వగానం చేస్తుంది.
=============                                                                                                              బమ్మెర


Sunday, July 3, 2016

యే దిల్‌ ముఝే బతాదే - తూ కిస్‌ పే ఆగయా హై - Ye Dill Mujhe Batade tu kis pe aagaya hain

కలల నిండా ఎవరీ రారాజు! 
* * * * *
మునుపెన్నడూ చూడని వాళ్లెవరో మనల్ని నీడలా వెంటాడుతుంటే, హృదయం కలవరపడిపోక ఏం చేస్తుంది? కాకపోతే ఆ రూపం సుందరమై, ఆ మాటలు ఆపాత మధురమై గుండెల మీద తారట్లాడుతుంటే హృదయం తెలియకుండానే పారవశ్యానికి లోనవుతుంది. పగలైతే సరే కానీ, రేయి రేయంతా కలల్లోకి జొరబడి హృదయాన్ని ఊయలలూపేస్తుంటే ఏమైపోవాలి? పైగా రేయి రేయంతా సాగే కలలు నిజాలే అనిపిస్తాయి. అయినా ఏదో అయోమయం మొదలై, అసలు పగేలేదో రేయేదో తెలియకుండా పోతుంది. ఈ స్థితిలో ఏమిటిదంతా? అని మన హృదయాన్ని మనమే ప్రశ్నిస్తే అది మాత్రం ఏం చెబుతుంది? మనమూ మన మనసూ వేరు వేరేమీ కాదు కదా! మనకు తెలియని నిజాలు దానికి మాత్రం ఎలా తెలుస్తాయి? ‘భాయ్‌-భాయ్‌’ సినిమా కోసం రాజేంద్రకృష్ణ్‌ రాసిన ఈ పాటలో ఈ కలవరపాటే కనిపిస్తుంది. మదన్‌ మోహన్‌ స్వర కల్పనలో గీతాదత పాడిన ఈ పాట నాలుగు దశాబ్దాల అనంతరం కూడా భారతీయ హృదయాల మీద భరతనాట్యం చేస్తూనే ఉంది. 
* * * * *
యే దిల్‌ ముఝే బతాదే - తూ కిస్‌ పే ఆగయా హై 
వో కౌన్‌ హై జో ఆకర్‌ - ఖ్వాబోఁ పే ఛాగయా హై / యే దిల్‌ ముఝే/ 
(ఎవరి మీద నువ్వు వాలిపోయావో - ఓ మనసా నాకు చెప్పేయవే 
వచ్చి నా కలల నిండా వ్యాపించిన . ఈయనెవరో కాస్త చెప్పేయవే) 
మనసెప్పుడూ మనతోనే, మనలోనే ఉంటే, మానవాళికి ఇన్నిన్ని తిప్పలు ఎందుకుండేవి? అది గాలిగాలిగా ఎటెటో తిరుగుతూ ఉంటుంది. ఎడతెగని సంచారమది. ఆ సంచారంలో ఎక్కడెక్కడ వాలుతుందో, అక్కడ ఎంతసేపుండి, అటునుంచి మళ్లీ ఎటు వెళ్లిపోతుందో ఎవరూ ఏమీ చెప్పలేరు. అయితే ఒక్కోసారి ఏమీ కదలకుండా, వాలిన చోటే తిష్టవేసి ఉండిపోయినా ఉండొచ్చు. అయితే అంతరంగంలో జరిగే ఈ పరంపరల గురించి ఎవరో వచ్చి మనకేమీ చెప్పరు. అందుకే మన మనస్సునే అడిగే పనిలో పడతాం. అయినా మన మనసు ఎవరి మీదో వాలిపోయినప్పుడు వాళ్లు మాత్రం ఊరుకుంటారా? మనసుకు నచ్చితే మనవెంట పడతారు కూడా. వస్తే వచ్చారు గానీ, పగలంతా మనతో ఉండి సంధ్యవేళయినా వెళ్లిపోతే ఫరవాలేదు. అలా కాకుండా నిదురోయిందే తడవుగా కలల్లోకి కూడా జొరబడితే ఏమనుకోవాలి? విషయం చాలా దూరమే వెళ్లిందని కదా అర్థం!
మస్తీ భరా తరానా - క్యోఁ రాత్‌ గారహీ హై 
ఆంఖో మే నీంద్‌ ఆకర్‌ - క్యూ దూర్‌ జారహీ హై 
దిల్‌ మే కోయీ సితమ్‌గర్‌ - అర్‌మాఁ జగా రహా హై 
వో కౌన్‌ జో ఆకర్‌- ఖ్వాబోఁ పే ఛా గయా హై / యే దిల్‌ ముఝే/ 

(రేయి ఉన్మత్త రాగాల్ని గానం చేస్తోంది ఎందుకని? 
కళ్లల్లోకి వచ్చినట్టే వచ్చి నిద్ర, దూరమైపోతోంది ఎందుకని? 
మనసులో వంచకుడెవరో ఆశల్ని మేల్కొలుపుతున్నాడు 
ఎవరీయన? వ చ్చి నా కలలనిండా వ్యాపించాడు!) 
పరాగాలూ, సరాగాలూ పగటి పూట మామూలే గానీ, ఒక్కోసారి రాత్రుళ్లు కూడా పగటినే తలపిస్తూ ఉన్మత్త రాగాలు వినిపిస్తాయి. అందుకు అనుగుణంగా కళ్ల దాకా వచ్చినట్టే వచ్చి నిద్ర మళ్లీవెనక్కి వెళ్లిపోతుంది.రేయి పగలైపోతుంది. ఇలా రాత్రుళ్లు పగళ్లయిపోతుంటే, పగటి కలలు రాకుండా ఏం చేస్తాయి? అయినా కలలు కలలే కదా! నిజాలు కలలుగా మారడం ఎందుకు? అందుకేనేమో నిజాల్నే తప్ప కలల్ని నమ్మని లోకం కోసం, ఊహలు, కలలు వాస్తవరూపంలో ఉండేలా రేయి పగలుగా మారిపోతుంది. కానీ, ఎన్నో రాత్రులు అలా గడిచిపోతుంటే ఒక్కోసారి కునికిపాట్లేవో వచ్చి క్షణకాలం కన్ను మలగవచ్చు కళ్లతో పాటే ఆశలూ నిద్రలోకి జారిపోవచ్చు. కానీ ఇంతలో ఏ ఆగంతకుడో వచ్చి ఆశల్ని తడముతుంటే ఇంక నిద్ర ఎక్కడ పడుతుంది? ఎన్నెన్నో రాత్రులు ఇలా నిద్రలేకుండా గడిచిపోతుంటే, తనువూ మనసూ మగతనిద్రా మత్తులో ఊగిపోతుంటే, రేయి ఉన్మత్త రాగాల్ని ఆలపించకుండా ఉంటుందా?
బేతాబ్‌ హో రహా హై - యే దిల్‌ మచల్‌ మచల్‌ కే 
షాయద్‌ యే రాత్‌ బీతే - క ర్‌వట్‌ బదల్‌ బదల్‌ కే 
యే దిల్‌ జరా సంభల్‌ జా - షాయద్‌ వో ఆగయా హై 
వో కౌన్‌ హై జో ఆకర్‌ - ఖ్వాబోఁ పే ఛాగయా హై / యే దిల్‌ ముఝే/ 
(అతలాకుతలం అవుతూ ఈ మది అశాంతి పాలవుతోంది 
అటూఇటూ దొర్లుతూనే బహుషా ఈ రేయి గడిచిపోతుందేమో 
కాస్త నిబ్బరించుకోవే మనసా! ఆయన వచ్చేసినట్లే ఉన్నాడు 
ఇంతకీ ఎవరాయన? వచ్చి నా కలలనిండా వ్యాపించాడు!) 
అక్షరం అక్షరం తెలిస్తే తప్ప అర్థం బోధపడనట్లు, ఏ మనిషైనా నఖశిఖం తెలిస్తేనే కదా గుర్తిస్తాం! లీలగా ఏదో కలలా వచ్చి అలా వె ళ్ళిపోతుంటే అతన్ని ఎలా గుర్తించగలం? తెలిసీ, తెలియని రూపం, మనసు ఎదుటి మనిషిని అల్లకల్లోలం చేయక ఏం చేస్తుంది? అతనేమిటో అతని మనసేమిటో తెలుసుకోలేని హృదయానికి నిద్ర ఆహారాలు ఏముంటాయి? కావాలని కళ్లు మూసుకున్నా, అటూ ఇటూ దొర్లడమే తప్ప నిదురైతే రాదు కదా! ఎప్పుడో క్షణకాలం నిదురపట్టినా అదే అదనుగా అతను కలల్లోకి జొరబడుతుంటే ఆ మనసేమైపోవాలి? అనునిత్యం కలల్లో రాజ్యమేలుతున్న వాడి పూర్తి ఆచూకీ తెలియకపోతే ఏమనుకోవాలి? ఏ నిర్ణయానికి రావాలి?
భీగీ హుయీ హవాయేఁ - మౌసమ్‌ భీ హై గులాబీ 
క్యా చాంద్‌ క్యా సితారే ఁ హర్‌ చీజ్‌ హై శరాబీ 
ధీరే సే ఎక్‌ నగ్‌మా - కోయీ సునాగయా హై 
వో కౌన్‌ జో ఆక ర్‌, ఖ్వాబోఁ పే ఛాగయా హై / యే దిల్‌ ముఝే/ 
(పవనాలు తడిసిపోయాయి, రుతువు గులాబీలా ఉంది 
చంద్రుడేమిటి? సూర్యుడేమిటి? ఇక్కడ ప్రతిదీ తాగుబోతయ్యింది 
నిదానంగా అతనెవరో ఒక గీతాన్ని వినిపించి వెళ్లిపోయాడు 
ఇంతకీ ఎవరాయన? వచ్చి నా కలలనిండా వ్యాపించాడు) 
హృదయగతంగా మనం తడిస్తే, గాలిగాలంతా తడిసిపోయినట్లే, నదులూ, పర్వతాలూ, అరణ్యాలూ తడిసినట్లే. భావాలు ఏ వర్ణాన్ని పులుముకుంటే, సమస్త ప్రకృతీ ఆ వర్ణాన్ని పులుముకున్నట్లే. దృష్టిని బట్టే సృష్ఠి అని ఊరకే అన్నారా? అయినా ప్రపంచంలో పారవశ్యాన్ని మించిన మఽధువేముంది ఆ మధువుతో సూర్యుడేమిటి? చంద్రుడేమిటి? పంచభూతాలూ మత్తెక్కిపోతాయి. సరిగ్గా అదే సమయంలో ఎవరో వచ్చి తన మీద చూపుల వర్షం కురిపిస్తూ, ఆకాశమంతా హోరెత్తేలా గొంతెత్తి పాడుతుంటే హృదయం మీదుగా ఎన్నెన్నో సముద్రాలు ప్రవహిస్తునట్లు ఉండదా? ముల్లోకాలు తన ముందు వాలినట్లు అనిపించదా?అయినా నిలువెల్లా ముంచేస్తూ ఇవన్నీ జరిగిపోతుంటే.... నువ్వు ఎవరి మీద వాలిపోయావో చెప్పు. క లల్నిండా వ్యాపించిన ఆయనెవరో చెప్పు అంటూ ఆదేశిస్తుంటే, ఆ హృదయం మాత్రం ఏం చెబుతుంది? అవన్నీ తెలియాలంటే ఆ మనసుతో పాటే పయనిస్తూ, ఆ మనసుతోనే జీవించడం తప్ప అక్కడింక మరో మార్గమే లేదు మరి!
====================