నీ పాపిట మళ్ళీ సిందూరం నింపుతా
జీవితం సాఫీగా సాగిపోయే అవకాశాలు ఎన్ని ఉంటాయో, అనుకోని మలుపు తిరిగి, అది ఆగిపోయే పరిస్థితులు కూడా అన్నే ఉంటాయి, ఆ విపరీత పరిస్థితులకు ఇతరులే కారణమైనా, అవి మన మే బంధీలమైపోవచ్చు. ఆ అవకాశం ఇవ్వకుండా తప్పించుకోవాలనిచూస్తే , ఆ ప్రయత్నంలో ఎన్ని సుడిగుండాలు దాటాలో చివరికి ఏ తీరాన్ని చేరుకుంటామో, తెలియదు. ఆ పరుగులో అలసి సొలసి ఇంకా పరుగెత్తలేక ఎవరి ఆశ్రయాన్ని కోరతామో తెలియదు. ఒకవేళ ఎవరైనా ఆ ఆశ్రయం ఇచ్చినా, అప్పటికి వారి పరిస్థితి కూడా సంక్షోభంలోనే ఉంటే ఏమనిపిస్తుంది? ఆశ్రయమిచ్చినందుకు కృతజ్ఞతతోనో లేదా మానవతా దృష్టితోనో వాళ్లకు అండగా నిలవాలని ఉంటుంది. తోడూ నీడగా నిలవాలని కూడా అనిపిస్తుంది. శిధిలమైపోయిన వారి జీవన సౌధాన్ని తిరిగి నిర్మిలంచాలనిపిస్తుంది. చెదిరిపోయిన వారి జీవితాన్ని తిరిగి నిలెట్టాలనిపిస్తుంది. ‘దాగ్’ సినిమా కోసం సాహిర్ లుధ్య్వాన్వీ రాసిన ఈ పాటలో ఈ ఆరాటమే, ఈ ఆర్థ్రతే కనిపిస్తుంది. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వంలో కిశోర్ కుమార్ పాడిన ఈ పాట డెబ్బైయవ దశాబాద్దాన్నంతా ఉబ్బితబ్బిబ్బు చేసింది. అక్కడితో ఆగకుండా అన్ని తరాలమీదా ఒక నిండు మేఘంలా ఆవహించింది అందుకే ఈ తరం కూడా ఈ పాటను అప్పుడో ఇప్పుడో మనసులో ఆలపిస్తూనే ఉంది.
* * * * * * *
మేరే దిల్ మే ఆజ్ క్యా హై, తూ కహే తో మై బతాదూఁ
తేరీ జుల్ఫ్ మై సవారూఁ, తేరీ మాంగ్ ఫిర్ సజాదూఁ
మేరే దిల్ మే క్యా హై, తూ కహే తో మై బతాదూఁ
(ఈ రోజు నా మదిలో ఏముందో, నువ్వడిగితే చెప్పేయాలని ఉంది
నీ కురుల్ని తిరిగి సవరించాలని ఉంది, నీ పాపిటను మళ్లీ అలంకరించాలని ఉంది.
ఈ రోజు నా మదిలో ఏముందో, నువ్వడిగితే చెప్పేయాలని ఉంది )
దేన్నయినా తొలిసారిగా నిర్మించడం కొంత సులువే. ఎందుకంటే చదునైన నేలమీద దాన్ని నిర్మిస్తాం. అలా కాకుండా ఆ శిధిల భవనాన్నే పూర్వ వైభవంతో మళ్లీ నిలబెట్టాలనుకుంటే అదెంతో కష్టమవుతుంది. ఎందుకంటే శిధిలాల మధ్యన పడి ఉన్న రాతిముక్కలు, గాజుముక్కలు అడుగడుగునా గుచ్చుకుంటాయి అరిపాదాలు, అరిచేతులు రక్తసిక్తమైపోతాయి. అయినా ఆ పునర్మిర్మాణానికి పూనుకోవడానికి కేవంల ప్రేమ ఉంటే సరిపోదు. కొంత సాహసం కూడా కావాలి. అయితే మనసున్న ఏ మనిషీ శిధిలాల్ని చూస్తూ ఊరుకోలేడు. చెదిరిపోయిన జీవితాల్ని చూసి ఏమీ
పట్టనట్టు తన దారిన తాను వెళ్లిపోలేడు. అందుకే ఆ సౌధాన్ని తిరిగి నిలబెట్టమని అతని అంతరంగం అనుక్షణం తరుముతూనే ఉంటుంది.
ముఝే దేవ్తా బనాకర్, తేరీ చాహతోఁ నే పూజా
మేరా ప్యార్ కహెరహా హై, మై తుఝే ఖుదా బనాదూఁ మేరే దిల్ మే ఆజ్ క్యా హై, తూ కహే తో మై బనాదూఁ
(నన్నో దేవతను చేసి, నీ ఆకాంక్షలు పూజించాయి
నా ప్రేమేమో నిన్ను దైవాన్ని చేయాలంటోంది
ఈ రోజు నా మదిలో ఏముందో, నువ్వడిగితే చెప్పేయాలని ఉంది )
ఆపదలో ఉన్నవారికి ఆదుకునే వారు దేవతామూర్తిలాగే కనిపిస్తారు. అందుకే వారిని ఆరాధిస్తారు, పూజిస్తారు. కానీ, అన్నీ తెలిసిన వారు ఆదుకోవడం కన్నా, అదుకునే అవకాశం ఇచ్చిన వారే గొప్ప అనుకుంటారు. జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశం ఇచ్చినవారు. జన్మనిచ్చిన సృష్టికర్తకు సమానంగా కనపడతారు. అందుకే వానిని దైవంగా హృదయంలో ప్రతిష్టించుకుంటారు. పైగా, తన పరిధులల్లో తనను ఉంచేయకుండా, వెంట తీసుకుని లోకాలన్నీ తిప్పే వారు తన కోసమే దిగివచ్చిన దివ్యమూర్తులుగా కనిపిస్తారు. దైవమై వారు జీవితమంతా వ్యాపిస్తారు. .
కోయీ డూండ్నే భీ ఆయే, తో హమే న డూండ్ పాయే
తూ ముఝే కహీఁ ఛుపాదే, మై తుఝే కహీ చుపాదూఁ
మేరే దిల్ మే ఆజ్ క్యా హై, తూ కహే తో మై బనాదూఁ
(ఎవరైనా వెతకడానికే వచ్చినా, మనల్ని పట్టుకోలేకపోవాలి
నువ్వు నన్నెక్కడైనా దాచెయ్, నిన్ను నేనెక్కడైనా దాచేస్తాను
ఈ రోజు నా మదిలో ఏముందో, నువ్వడిగితే చెప్పేయాలని ఉంది)
జీవన ప్రవాహంలో పడిపోయి ఆప్తమిత్రుడైనా ఒక్కోసారి మనల్ని మరిచిపోతాడేమో గానీ, శత్రువెప్పుడూ మనల్ని మరిచిపోడు. పగబట్టిన లోకం కూడా మనల్ని మరిచిపోదు. అలా అని అజాత శత్రువుగా నిలవడం ఎంతమందికి సాధ్యమవుతుంది. ఏ కారణంగానో ఎక్కడో ఒక ఘర్షణ అంకురిస్తుంది. ఆవేశకావేశాల్లో జరగరానిదేదో జరిగిపోతుంది. చేసిన తప్పునకే శిక్ష పడిందని ఎవరనుకుంటారు? తప్పు తనదేనని తెలిసినా దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఎంతమంది అనుకుంటారు? అందుకే తన నేరమేమీ లేనట్లు, ప్రతీకారాలకు పాల్పడతారు. తప్పు తనదేమీ కాకపోయినా పులి ఎదురైనప్పుడు పారిపోక తప్పదు కదా! అలా పారిపోతూ అలసి సొలసి డస్సిపోయిన వారిని ఎవరైనా చేరదీసి ఎవరి కంటా పడకుండా గుండెల్లో దాచేస్తే అంతకన్నా ఏంకావాలి? ఈ బాధలు ఏదో ఒకరికే అనికాదుగా, కలిసినడుస్తున్న ఇద్దరికీ ఉండవచ్చు. అలాంటి సమయంలో ఒకరికొకరు రక్షణ కవచంగా, ఒకరికొకరు జీవితాంతపు సహచరులుగా ఉంటే ఎన్ని బాధలైనా ఇట్టే ఎదురుకోవచ్చు.
మేరే బాజువోఁ మే ఆకర్ తేరా దర్ద్ చైన పాయే
తేరే గేసువోఁ మే చుప్కర్, మై జహాఁ కే గమ్ భులా దూఁ
మేరే దిల్ మే ఆజ్ క్యా హై, తూ కహే తో మై బతా దూఁ తేరీ జుల్ఫ్ ఫిర్ సవారూఁ తేరీ మాంగ్ ఫిర్ సజాదూఁ
(నా బాహువుల్లో వాలిపోయి నీ బాధ లన్నీ ఉపశాంతి పొందాలని ఉంది. .
నీ కేశాల్లో దాచుకుని, నాకు లోకపు దుఃఖాన్నంతా మరిచిపోవాలని ఉంది
ఈ రోజు నా మదిలో ఏముందో, నువ్వడిగితే చెప్పేయాలని ఉంది నీ కురుల్ని తిరిగి సవరించాలని ఉంది, నీ పాపిటను మళ్లీ అలంకరించాలని ఉంది)
ప్రేమతో చాచిన బాహవుల్ని మించిన శాంతివనం ఏముంది? అక్కడ ఎంతటి బాధైనా అడుగంటిపోతుంది. ఎదుటి వారి ఆత్మక్షోభలన్నీ ఏమారిపోతాయి. అదేసమయంలో ఎదుటి వారి హృదయం కూడా ఆశాకమైపోతే అందులో నువ్వూ తలదాచుకోవచ్చు. లెక్కపెట్టుకోము గానీ, లోకం చేసే గాయాలు ఒకటా రెండా? గాయాల రుచి మరిగిన లోకం, అవకాశం చిక్కాలే గానీ, రోజుకో గాయం చేస్తుంది. అలా గాయాలు చేస్తూ, లోకం దుమ్మెత్తిపోస్తున్నా సరే, ఎంత కసిగా ఈటెలు విసురుతున్నా సరే, మనల్ని చేరదీసే ఆత్మీయ హృదయం ఒక్కటుంటే చాలు. మనకు వెయ్యేనుగుల శక్తి వస్తుంది. అలా అన్ని ఆవరోధాల్నీ అధిగమిస్తూ విజయపతాకం ఎగరవేస్తుంది, వేయిజన్మల ఆనందాన్ని ఆస్వాదిస్తుంది.
--------------------
* * * * * * *
సాహిర్ లుత్వాని సాహిత్యం ,లక్ష్మి కాంత్ ప్యారాలాల్ సంగీతం లో ఎంత మధురమైన పాట ఇది. చిత్రీకరణ కూడా చాలా బావుంది . ఇంక బమ్మెర గారి వివరణ గురించి చెప్పేదేముంది? "అద్భుతం" అనే మాట తప్ప ఇంకేం వాడతాం?
ReplyDeleteYES VERY TRUE.
ReplyDeleteYES VERY TRUE.
ReplyDelete