లోకంలో ప్రేమే కాదు... కోట్లాది దుఃఖాలున్నాయి.
మనిషి జీవితంలో ఎన్నెన్ని దశలు? ఒక నాడు నీటిబుడగలతో అడుకున్న వాడే కొన్నాళ్లుపోయాక నక్షత్రాలతో ఆడుకుంటాడు. ఒక నాడు తరంగమై కదిలిన వాడు కొన్నాళ్లు పోయాక సముద్రమై ఎగిసిపడతాడు. తాను సుఖంగా ఉంటే చాలనుకున్న వాడు ఒక నాడు సర్వ సుఖాలతో ఉండికూడా సాటి మనుషుల దుఃఖాలు చూసి వెక్కివెక్కి ఏడుస్తాడు. ప్రాణానికి ప్రాణమైన ప్రేమమూర్తి ఎదురుగానే ఉన్నా ఏమీ పట్టనట్లు, మంటల్లో కాలిపోతున్న మనుషుల కోసం పరుగెడతాడు. తనతో పాటు మరికొందరిని కలుపుకుని ఆ మంటల్ని చల్లార్చే పనిలో పడతాడు. లోకమే జీవితమై పోయినవాడికి, తన వ్యక్తిగత జీవితం జీవితంలానే అనిపించదు. ఈ ఇతివృత్తమే ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ఈ గీతంలో ధ్వనిస్తుంది. ‘ కైదీ’ సినిమాలోని ఈ పాటను రశీద్ ఆతే్త్ర స్వరబద్ధం చేస్తే మహాగాయని నూర్జహాన్ మహార్థ్రంగా గానం చేశారు.
* * * * *
ముఝ్సే పహలీ- సీ ముహబ్బత్, మేరే మహబూబ్ న మాంగ్ /ముఝ్సే/ మైనే సమ్ఝా థా కె, తూ హై తో దరఖ్షాఁ హై హయాత్
తేరా గమ్ హై తో గమ్-ఎ-దహర్ కా ఝగ్డా క్యా హై
(ఒకప్పుటి ఆ ప్రేమను ప్రియా! నువ్వింక నా నుంచి ఆశించకు
నీవుంటే బతుకుంతా కాంతులీనుతుందనే అనిపించింది నాకు... కానీ,
నీ బాధల్లో ఇక్కడ నేనుండిపోతే... ప్రపంచ బాధల పైన ప్రతిఘటన ఎక్కడ?)
తాను ప్రేమించిన వ్యక్తే తన లోకంగా అనుకుంటున్నంత కాలం,, అసలు సిసలైన లోకమొకటి అవతల ఉందన్న సంగతే గుర్తుకు రాదు. తనకు, తన ప్రేమమూర్తికి ఆవల ఏం జరిగినా తనకు సంబంధమే లేదనిపిస్తుంది. ఆ ఒక్క వ్యక్తి తనతో ఉంటే జీవితం కోటి సూర్య ప్రభలతో వెలిగిపోతుందనిపిస్తుంది. తన ప్రేమమూర్తే తన నేలగా ఆకాశంగా అనిపిస్తుంది. కానీ, తరంగానికేసి చూస్తూ అదే సముద్రమని ఎంతకాలం మనల్ని మనం మభ్యపెట్టుకోగలం? లోకంలో జరుగుతున్న అనేకానేక మానవ పోరాటాల్లో ఏ ఒక్కదానితోనూ సంబంధం లేకుండా ఎన్నాళ్లని ముడుచుకు పడిఉంటాం? అలా ఉండిపోదామనే అనుకున్నా, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక చోట ఎవరి ఆర్తనాదమో మన చెవుల్లో గింగురుమంటుంది?. ఎవరి అశ్రుధారో అగ్నిధారలా మన గుండెల్ని కాల్చివేస్తుంది. అంతటితో అన్నేళ్లూ మనల్ని కట్టిపడేసిన సంకెళ్లన్నీ పటాలున తెగిపోతాయి. హఠాత్తుగా మనం మానవ సముద్రంలో కలసిపోతాం. అప్పటిదాకా దోసిట్లో పెట్టుకున్న తరంగాన్ని సముద్రంలోకి వదిలేసి మనమూ ఆ సముద్రంలోకి దూకేస్తాం. సముద్రమంతా వ్యాపిస్తాం. నువ్వు నాకోసం, నేను నీ కోసం అనే ధోరణిపోయి మనమున్నది లోకం కోసం.... కోటానుకోట్ల జనావళిని శోక విముక్తి చేయడానికి సాగుతున్న పోరాటాల్లో మనమూ భాగమవుతాం. ఆ స్థితిలో మనల్ని కట్టిపడవేసే బంధాలకు వీడ్కోలు చెబుతాం.
తే రీ సూరత్ సే హై ఆలమ్ మేఁ బహారోఁ కో సబాత్
తేరీ ఆంఖో కే సివా దునియా మేఁ రఖా క్యా హై -2
తూ జో మిల్ జాయే తో తక్దీర్ నిగూఁ హో జాయే
యూఁ న థా మైఁ నే ఫకత్ చాహా థా యూఁ హో జాయే
ఔర్ భీ దుఖ్ హైఁ జమానే మే ముహబ్బత్ కే సివా రాహ్తేఁ ఔర్ భీ హైఁ వసల్ కే రాహత్ కే సివా
హాఁ.... ముఝ్ సే పహలీ- సీ ముహబ్బత్, మేరే మహబూబ్ న మాంగ్ / ముఝ్సే /
(నీ మోవితోనే లోకంలో వసంతం వెల్లివిరుస్తోంది
నీ కళ్లు కాక లోకంలో ఇంకేముంది? నువ్వే లభిస్తే అదృష్టమే వచ్చి నా పాదాక్రాంతమవుతుంది
అలా అని కఛ్చితంగా ఇలాగే జరగాలని కూడా నేనేమీ అనుకోలేదు
ఎందుకంటే పపంచంలో ప్రేమ ఒక్కటే కాదు, ఎన్నో దుఃఖాలున్నాయి
ప్రేమికుల కలయికే కాదు ఇంకా సంతోషాలెన్నో ఉన్నాయి
అందుకే ఒకప్పటి ఆ ప్రేమను ప్రియా నువ్వింక నా నుంచి ఆశించకు)
లోకపు అన్ని వైపుల్నించీ ఈటెలే దిగుతున్న సమయంలో ఎవరికైనా తన ప్రేమమూర్తిని మించిన వారెవరుంటారు? అందుకే జీవచైతన్యాన్ని ప్రదీపింప చేసే ఆ మూర్తిమత్వం ఒడిలో వాలిపోవాలనిపిస్తుంది. ఆ ముఖబింబం వెదజల్లే ఆ దివ్యకాంతుల్లో ఓలలాడాలనిపిస్తుంది. కోటి చంద్రబింబాలను ప్రతిబింబింప చేసే ఆ కళ్లను, జీవితాంతపు భరోసానిచ్చే ఆ కళ్ల కాంతి కిరణాలను మించి ఎవరికైనా ఈ లోకంలో ఇంకేముంటుంది? అందునా ఆ ప్రేమమూర్తి పరిచయాలకే పరిమితం కాకుండా, ఏకంగా జీవిత భాగస్వామిగా నిలబడితే ఇంకేముంది? అదృష్టదేవతే వచ్చి తన లోగిలిలో నిలిచినట్లనిపిస్తుంది. అయితే, లోకంలో హోరెత్తే కోటానుకోట్ల శోశధ్వనులు ఒకసారి గుండెల్ని తాకాక అప్పటిదాకా మనం మునిగి తేలుతున్నన ప్రేమలోకం మపకబారిపోతుంది. అంతా మాయలా అనిపిస్తుంది. అంతటితో ఆ హృదయం, తన వ్యక్తిగత ప్రేమనుంచి తన ఆత్మాశ్రయ జీవితం నుంచి బయటికొచ్చి జనంలో కలిసిపోతుంది. జనమే మనమని కోటి ఝంకారాలతో జనజీవన గాధల్ని ఎలుగెత్తి చాటుతుంది. విషాదాల్ని, ప్రమోదాలుగా మార్చే తన వంతు ప్రయత్నం చేస్తుంది.
అన్గినత్ సదియోఁ కే తారీక్ బహీమాన తలిస్మ్
రేషమ్- వో -అట్లస్-వో- కంఖ్వాబ్ మేఁ బున్వాయే హుయే
జాబజా బిక్తే హువే కూచా-వో-బాజార్ మేఁ జిస్మ్
ఖాక్ మేఁ లిథ్డే హువే, ఖూన్ మేఁ నహ్లాయే హువే
జిస్మ్ నిక్లే హువే అమరాజ్ కే తన్నూరోఁ సే
పీప్ బహతీ హుయీ గ ల్తే హువే నాసూరోఁ సే
లౌట్ జాతీ హై ఉధర్ కోభి నజర్, క్యా కీజే
అజ్ భీ దిల్కష్ హై తేరా హుస్న్ మగర్ క్యా కీజే -2
ఔర్ భీ దుఖ్ హైఁ జమానే మే ముహబ్బత్ కే సివా
రాహతేఁ ఔర్ భీ హైఁ, వస్ల్ కీ రాహత్ కే సివా
ముఝ్ సే పహలీ- సీ ముహబ్బత్ మేరే మహబూబ్ న మాంగ్ / ముఝ్సే/
(ఎన్నో యుగాలుగా విస్తరిస్తున్న చీకటి కాలం
సిల్కు, శాటీన్, బంగారు దారాలతో అల్లుకుంటోంది
వీధివీధినా దేహాలు అమ్ముడుబోతున్నాయి
దుమ్ము కమ్ముకుని రక్తమోడుతున్న దేహాల
మానని గాయాలు రసిగారుతున్నాయి.
నా దృష్టి అటే పోతోంది. మరి .. నే నేం చేయాలి?
నీ సౌందర్యం ఇప్పటికీ మనోహరమే గానీ, నేనేం ఏంచేయాలి?
ప్రపంచంలో ప్రేమే కాదు ఇంకా దుఃఖాలున్నాయి.
ప్రేమికుల కలయికే కాదు, ఇంకా సంతోషాలున్నాయి
అందుకే ఒకప్పటి ఆ ప్రేమను ప్రియా! నువ్వింక నానుంచి ఆశించకు)
‘‘మనిషి తన జీవితంలో ఏది కోల్పోయినా ఫరవాలేదు కానీ తనను తాను కోల్పోకూడదు’’ అంటూ ఉంటారు. తనను తాను కోల్పోవడం అటే తన జీవితం నుంచి తాను వైదొలగిపోవడమే కదా!. దేహాలు అమ్ముడు పోవడం అంటే నీ శ్రమ ఫలితం నీకు దక్కకపోవడం. నీకు నువ్వు కాకుండాపోవడం. అలా నిన్ను నిన్ను కాకుండా చేసే శక్తులు అనాదిగా ఈ లోకంలో తిరుగాడుతున్నాయి. ఏదో నిన్నూ నన్నూ మాత్రమే అని కాదు కోటానుకోట్ల మందిని అవి నిర్జీవం చేస్తున్నాయి. కాకపోతే అవి ఎంతో తెలివిగా ఇతరులెవరూ తమ అసలు రూపాన్ని గుర్తించకుండా బంగారు దారాలతో, పీతాంబరాలతో తమను తాము చుట్టేసుకుంటున్నాయి. ఆ ముసుగులో ఉంటూ జీవితాల మీద దాడులు చేస్తున్నాయి. హృదయాల్నీ తీవ్రంగా గాయం చేస్తున్నాయి. ఆ దాడుల పాల్పడిన దేహాలు నేలమీద పడి దొర్లుతున్నాయి. గాయపడిన హృదయాలు రక్తలోడుతున్నాయి. లోకంలో ఇన్ని ఘోరాలు జరిగిపోతుంటే హృదయం ఉన్న ఏ మనిషైనా తన ప్రేమలోకంలో ఎలా ఉండిపోతారు? తాను ప్రేమించిన వ్యక్తి ఎంతటి సౌందర్యమూర్తి అయినా తన దృష్టి ఆ వైపు పోనే పోదు. మనసున్న ఏ మనిషైనా సాటి మనిషుల బాధల్ని చూస్తాడు. సామాజిక రుగ్మతల మూలాల్ని వెతుకుతాడు. వాటినుంచి విముక్తి కలిగించే తన వంతు ప్రయత్నం చేస్తాడు. లలాంటి వారినే లోకం మనిషి అంటుంది. మనీషి అంటుంది. ఇంకా ఇంకా విస్తరిస్తే రాజర్షి అంటుంది... మహర్షి అంటుంది..
... బమ్మెర
No comments :
Post a Comment